కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని (సీపెట్) గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రారంభించారు. గురువారం ఉదయం 11.00 గంటలకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడతో కలసి సీపెట్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'సీపెట్లో శిక్షణ పొందిన విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నైపుణ్య అభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) సెంటర్లు ఏర్పాటు చేస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న చట్టం చేసిన తొలిరాష్ట్రం మనదే. యువతను ప్రోత్సహించేందుకు చట్టాన్ని తీసుకొచ్చాం. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా యువతలో నైపుణ్యాన్ని తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాం. సీపెట్ లాంటి సంస్థలు మరిన్ని రావాల్సి ఉంది. ఇలాంటి సంస్థలను మరిన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం.' అని అన్నారు.
కేంద్రమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ.. సీఎం జగన్తో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది. ఏపీలో ఇలాంటి సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి అందించిన సహకారం అభినందనీయం. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి సంస్థలు ఎంతో ఉపయోగపడతాయి. మన దేశంలో యువత శాతం ఎక్కువగా ఉంది. యువతను సరైన విధానంలో ఉపయోగించుకుంటే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటాం. యువతలో నైపుణ్యాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటికే 37 సీపెట్ కేంద్రాలున్నాయి. మరో అయిదుచోట్ల సీపెట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.' అని తెలిపారు.